శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం ప్రారంభం ముగిసిన చంద్రగ్రహణం రాత్రి నుండి యధావిధిగా అన్నప్రసాద వితరణ తిరుమల, 2022 నవంబరు 08: శ్రీవారి ఆలయంలో మంగళ వారం రాత్రి 8.20 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6.27 గంటలకు ముగిసింది. ఈ కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 8.40 గంటలకు ఆలయం తలుపులు మూశారు. దాదాపు 12 గంటల అనంతరం రాత్రి 7.20 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. అన్నప్రసాద వితరణ ప్రారంభం చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8.30 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును రాత్రి 7.30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అన్నప్రసాదం కాంప్లెక్స్ మూసివేత వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా ఉదయం 6 గంటలకు ఫుడ్ కౌంటర్లలో దాదాపు 10 వేల మందికి అల్పాహారం అందించారు. అదేవిధంగా, వైభవోత్సవ మండపం, సిఆర్వో వద్ద దాదాపు 30 వేల పులిహోర పొట్లాలు భక్తులకు పంపిణీ చేశారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఏఈవో శ్రీ పార్థసారధి, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. @TTD News
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
